
రాయలసీమ రమ్య చిత్రకారుడు సి.యన్.వెంకటరావు
శ్రీ సి.యన్. వెంకటరావు అంధ్రప్రదేశ్ యందు సుప్రసిద్ధ చిత్రకారులు శ్రీ నారాయణరావు సత్యభామాబాయి అను పుణ్యదంపతులు వీరి తల్లిదండ్రులు. అనంతపురం జిల్లా పెనుగొండ లో నివశించారు. వేలూరు, నెల్లూరులందు విద్యాబ్యాసము.బాల్యము నుండి యే వీరికి చిత్రకళయందు అభిరుచి మెండు తత్పలితముగా అంజనేయుని చిత్రములను తరచుగా వేయుచుండెడివారు. చెన్నపట్టణము చిత్రకళా పాఠశాల యందు మూడు సంవత్సరాలు శిక్షణ పొంది యోగ్యతా పత్రము పొందిరి, అనంతరము అనంతపురమందలి పురపాలకోన్నత పాఠశాలయందు చిత్రకళాధ్యాపకులుగా చేరి నిర్విరామకృషితో ఆ కళయందు ప్రావీణ్యము సంపాదించిరి. ఆ సమయముననే వీరనేక తైలవర్ణ చిత్రములను వ్రాసిరి. అనంతపురము వీడి పెనుకొండ బోర్డు ఉన్నత పాఠశాలలో చిత్రకళోపాధ్యాయులుగా చేరిరి. పెనుకొండ పరిసర ప్రకృతి రమణీయ దృశ్యములు వీరి కళారాధనకు దోహదమైనవి
వీరి మొదటి తైలవర్ణ చిత్రము ‘ధ్రువనారాయణ, శ్రీరామ పట్టాభిషేకము, కురుక్షేత్రము లంకిణీ సంహారము హరిహరులు కృష్ణరాయలు మేఘసందేశము మొదలైన తైలవర్ణ చిత్రములు వీరి ఉపజ్ఞకు, భావనాపటిమకు, వర్ణమ్మేళనమునందలి నిస్సీమ కుశలతకు నిదర్శనాలుగా నిలుస్తాయి. కళాభిమాని, సహృదయుడు శ్రీ టి.యల్. ఆర్. చంద్రన్, ఐ.పి.యస్. వీరి కళాభివృద్ధికి నొసగిన చేయూత ప్రశంసనీయము. వారి ప్రోద్బలమున నీటి రంగు చిత్రములు వ్రాయ నుపక్రమించారు. శ్రీ చంద్రన్ గారి ప్రోత్సాహమున మదరాసుకు వెళ్ళి ప్రముఖ చిత్రకారులు శ్రీ దేవీప్రసాద్ రాయ చౌదరిగారి యొద్ద కొన్ని మెళకువలను తెలిసికొన్నారు.
పిమ్మట బొంబాయి, కలకత్తా, లాహోరు మున్నగు నగరముల లోని చిత్రకళా పాఠశాలలను దర్శించి ఆయా సాంప్రదాయముల వైశిష్టమును ఆకలించుకున్నారు. ఇటు వివిధ చిత్రకళా సాంప్రదాయములను సమన్వయపరచి, విజయనగర శిల్ప కళా నిధులను తరచి, వర్ణసమ్మేళనమున స్వీయ ప్రతిభను జోడించి కొంగ్రోత్త పోకడలతో చిత్రకళయందు సిద్ధహస్తులైనారు
వీరి ప్రసిద్ధ చిత్రములలో కాపుపడుచు, సుగాలి పడుచు, కావేరి జననము,
అర్ధనారీశ్వరుడు, రతీమన్నథుడు మేరియూ, ద్వైతాద్వైత ప్రేమతత్వము భారతమాత, భారతమత సంచయము, శాంతి పుష్పము, శివకుటుంబ కృత్యము, ప్రేమతత్త్వము మున్నగునవి పేరెన్నికగన్నవి, వీరి పెక్కుచిత్రములు గృహలక్ష్మి భారతమాస ప్రతికలందు ప్రచురింపబడినాయి.
హైదరాబాదు ‘సాలార్ జంగ్
మ్యూజియం లో వీరి చిత్రములు ఉన్నాయి. రాష్ట్రపతి శ్రీ రాజేంద్రప్రసాద్ గారికి బహుకరించిన ‘గౌతమీ ఆవతరణము’ వీరి కళాపరాకాష్టకు నిదర్శనము. శ్రీ వెంకటరావు గారి కళానైపుణ్యము స్వదేశము నధిగమించి ఇంగ్లాండు, జపాను. జర్మనీ మొదలైన విదేశములందును విస్తరించింది, జీవిత చరమ దశయందును వీరు తమ వ్యాసంగమును మానలేదు వివిధ చిత్రములు వీరికి గల దైవభక్తిని, దేశభక్తిని పురాణాభిరుచిని, మత సామరస్యమును వెల్లడిచేస్తాయి. పెనుకొండలో విజయనగర చిత్రకళాశాలను స్థాపించి తద్వార చిత్రకళాభిమానులలో ఈ విద్యను వ్యాపింపజేశారు. ఒక్క చిత్రకళకే వీరి ప్రతిభ పరిమితము కాలేదు అరు భాషలందు ధారాళముగా భాషించగలరు సున్నిత హృదయులు, ఆర్తులను ఆదుకొను స్వభావముగలవారు. హాస్యచతురులు నాటకములందు హాస్యప్రధాన భూమికలనే నిర్వహించెడివారు. “ఇందిర ఎం.ఎ., రామస్వామి’ వీరు రచించన నాటికలు, ఏకనాదము, తందానబుర్ర ఢక్కి వీరి అభిమాన వాద్యములు. వీటిని వాయిస్తూ పాటలను పాడెడివారు. పొడువైన సన్నని దేహముతో తెల్లని వస్త్రములను ధరించి చూపరుల నాకర్షించెడివారు. తన చతుర సంభాషణలతో నెంతటివారినైన ఆకట్టుకొనగల నైపుణ్యము గలవారు
స్వీయ పరిశ్రమలో చిత్రకళాకోవిదులై రాణించి పెక్కుండ్రు శిష్యుల ఆత్మసాత్మృతుల గావించి గణనకెక్కిన ధన్యజీవి. కళోపానకు, కాళావ్యాప్తికి జీవితము నంకితము చేసిన పావనమూర్తి, ఈయన కుమారుడు కీ॥శే శ్రీనివాసరావు కూడ తండ్రికి దీటైన చిత్రకళా విశారదుడు, వీరిరువురి చిత్రములు జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహింపబడు చిత్రకళా ప్రదర్శనములందు ప్రదర్శింపబడినవి. కళాహృదయుడు శ్రీ వెంకటరావు 1940మార్చినెల 10 వ తేదీన కన్ను మూశారు.
వ్యాసకర్త:–వక్కా నరసింహమూర్తి
రాయలసీమ వైభవం పుస్తకం నుంచి యథాతథంగా.
సేకరణ :- చందమూరి నరసింహారెడ్డి.