
మానవసేవే మాధవసేవగా భావించి కరువు కాటకాలు సంభవించినపుడు సాటివారికి తన సర్వస్వాన్ని ధారపోసిన దానకర్ణుల పైన జానపదులు భక్తి ప్రపత్తులతో పాటలు పాడుకుంటారు. రాయలసీమలో వెంగళరెడ్డి, సుద్దపల్లి లక్షుమ్మ, సుద్దపల్లి రామచంద్రారెడ్డి, యాదళ్ళ నాగమ్మ, చిన్న అండూరి మొదలైన వారు దానకర్ణులుగా ప్రసిద్ధి పొందారు. వీరి దాతృత్వాన్ని ప్రశంసించ కథాగానాలున్నాయి. ఈ కథా గానాల్లో బుద్దా వెంగళరెడ్డి గేయం ప్రశస్తమైనది. ఈ కథాగానానికున్న వ్యాప్తి సీమలో మరి ఏ ఇతర గానానికి లేదు. రాయలసీమ జిల్లాలలో ముఖ్యంగా రైళ్ళలో, బస్సుల్లో తిరునాళ్ళలో ఎక్కడపడితే అక్కడ ఈ కథాగానం వినిపిస్తుంది. ముఖ్యంగా భిక్షుక వృత్తితో జీవనం సాగించేవారు. ఈ పాటలను ఆలపిస్తుంటారు.
బుడ్డా వెంగళరెడ్డి
బుడ్డా వెంగళరెడ్డి క్రీ.శ. 1822లో కర్నూలు జిల్లాలో జన్మించిన రేనాటి దానకర్ణుడు. ఇతని దానగుణాన్ని మెచ్చుకొని విక్టోరియా మహారాణి 1866లో బంగారు పతకాన్ని బహూక రించింది. ఈ పతకం ఇప్పటికి ఉయ్యాలవాడ లోని బుడ్డా వెంగళరెడ్డి వారసుల వద్ద ఉంది. క్రీ.శ. 1866లో రాయలసీమ లో గొప్ప కరువు వచ్చింది. దానినే ‘ధాతుకరవు’ అంటారు. అనంతపురం జిల్లా పైన ఈ కరువు ప్రభావ మెక్కువగా చూపింది. ఆ సమయంలో బుడ్డా వెంగళరెడ్డి దాదాపు నెలలపాటు తనకున్న పన్నెండు పాతర్ల ధాన్యాన్ని ప్రజల కోసం ఖర్చు చేయడమే గాక, స్నేహితుల దగ్గర అప్పుచేసి పేదల ఆకలిని తీర్చాడు. అందువల్లే ఆయన దానకర్ణుడుగా పేరు పొందారు. బుడ్డా వెంగళరెడ్డి చేసిన దానధర్మాల గురించి ఎన్నో కథలు ప్రచారంలో వున్నాయి.
“ఉత్తరాది ఉయ్యాలవాడలో ఉన్నది దరమం చూడండదు
వేడికి బుద్దా వెంగనరెడ్డి – దొడ్డ వైభువనే తెలియడయా
ఉత్తరాం.!దొడ్డ సైజున వీదొరలు మెచ్చగా – ఇడుపున
గుర్పొముండునయా ఇడుపున గూర్చో వెంగళరెడ్డి
యిక యిక నకుతానుండు వయా
రావం దరమంగ్యానం తెలిసీ -చరమ రాజువలె ఏలనయా
వచ్చిన బ్రతికిన ఎంగవరెడ్డికి – స్వర్గలోకమే ఉన్నదయా
ఉత్తరాది!
పున్నెం చేసిన ఎంగవరెడ్డికి – పూల పానుపే ఉండునయా
మాటపాచ్చం తెలిపిన ప్రభువని – మల్లెపూల
పార్చేతురయా !త్తరాది! అన్న వస్తరములిప్పించే సెనయా
గోయిందాయని పాడే జనులకు – గోపురానమే చేసినయా
పాలులేని పసి బాలుర కెల్లా – పాల సలేంద్రలు పెట్టనయా
పెళ్ళిళ్ళు కాని బీద జనులకూ -సేయించెనయా
కాలులేని కరమొండివాళ్ళకూ – ఒంటెద్దు కళ్ళు సేయించ నయు
కుంటివాళ్ళకూ గుడ్డి వాళ్ళకూ – ఈడు జోడు మనుముల సూసి
పుణ్యం చేసిన యెంగళరెడ్డికి – పూల పానుపే వచ్చునయా
మాట సౌచ్చం తెలిసిని ఎటువని – మల్లె పూలపాన్వే తురయా ||ఉత్తరాది||
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

19 శతాబ్దిలో రేనాటి సీమను పరిపాలించిన గొప్ప వీరుడు. ఇతడు కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ జమీందారు పెద్ద మల్లారెడ్డి కొడుకు ఆంగ్లేయులు ఉయ్యాలవాడ జాగీరును హస్తగతం చేసుకొని పెద్దమల్లారెడ్డికి నెలకు 70 రూపాయల భరణం చెల్లించేవారు. నారసింహా రెడ్డి తాత నొస్సం జమీందారు జయరామిరెడ్డి, జయరామిరెడ్డి కొడుకు చనిపోవడంతో కూతురు కొడుకైన నారసింహారెడ్డిని ఆయన దత్తత తీసుకున్నాడు. ఆంగ్లేయులు ఈ జాగీరును కూడా స్వాధీనం చేసుకొని రామిరెడ్డికి ఇచ్చే భరణాన్ని నరసింహారెడ్డికి ఇవ్వడానికి అంగీకరించలేదు.
ఉయ్యాలవాడ జాగీరుదారు వంశస్తుడుగా తనకు రావలసిన భరణం కోసం, నారసింహారెడ్డి తన అనుచరుని కోవెలకుంట్ల తాసిల్దార్ వద్దకు పంపాడు. తాసిల్దార్ భరణం ఇవ్వకపోగా నరసింహారెడ్డిని గురించి అవహేళనగా మాట్లాడాడు. విషయం తెలిసి నారసింహా రెడ్డి తన అనుచరులతో కలిసి కోవెలకుంట్ల తాసిల్దార్ తల నరికి నాయనాలప్ప కొండగుహలో దాచాడు. ఈ తిరుగుబాటును సహించలేని అప్పటి కడప కబ్జెకర్ కాక్రేన్ మిలిటరీ సహాయంతో నారసింహారెడ్డిపై దాడి చేశాడు. ఈ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్న నారసింహారెడ్డి మూడు నెలలపాటు బ్రిటీష్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు కుటిలోపాయంతో బ్రిటీష్ వారు నారసింహారెడ్డిని బంధించి ఉరి తీస్తారు. విప్లవకారులను, ప్రజలను భయ భ్రాంతులను చేయడానికి నారసింహారెడ్డి తలను దాదాపు 30 సం||రాల పాటు కోవెలకుంట కోటలోని ఉరికొయ్యకు వేలాడదీసి ఉంచారు. నారసింహారెడ్డి వీరత్వాన్ని కీర్తిస్తూ అనేక కథాగానాలు రాయలసీమ ప్రాంతంలో ప్రచారంలో ఉన్నాయి.
“అదిగో వచ్చే ఇదిగో వచ్చె నారసింహారెడ్డి
పళపళ పళపళ కేక లేసరా నారసింహారెడ్డి
చంద్రాయుధమూ చేత బట్టనే నారసింహారెడ్డి
కోబలీ రణబలీయన్నతే నారసింహారెడ్డి
ఆవుల మందలో పులీ దుమికినా చందము దుమికినాడూ
రెడ్డి ఎక్కినా గుర్రములమీదే ఏవిధమొచ్చినదీ
కుప్పటా గంతుల మీద వచ్చెరా బారా హజ్జారీ
వచ్చిన పక్కా సైన్యము అంతా ముందుకు దుమికినదీ
వంచినట్టి బలెముల పైననూ వాలలాడుతారు
సాన జేసినా కత్తులమీదా సవకళించినారు
అరవై వొక్కా తుపాకులండీ ఫెళఫెళ వాగినవి
విరగ నరకుతా పోతాడయ్యా నారసింహారెడ్డి
||అదిగోవచ్చె
కాలగర్భంలో కలిసిపోతున్న కథాగానాలను సేకరించి అధ్యయనం చేసి పరిరక్షించుకోవలసిన ఆవశ్యకత ఎంతైన ఉంది.మానవశాస్త్ర, సామాజిక శాస్త్ర దృక్కోణంతో పరిశీలిస్తే ఈ కథాగానాలు చారిత్రక పునర్నిర్మాణానికి ఎంతగానోఉపయోగపడతాయి.
__సి.రమాదేవి