
క్రీ.శ. 1274 లో విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్న వీరబుక్కరాయలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఖాద్రి వృక్షాల నీడలో విశ్రమించాడు .అప్పుడు ఒక చెట్టు కింద కొన్ని శిలలు కనిపించడం తో అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కట్టించాడు. ఆ తర్వాత క్రమక్రమంగా అది అభివృద్ధి చెందడం మొదలైంది. క్రీస్తుశకం 1391లో నరసింహ లక్ష్మన్న అనే దాసరులు ఇద్దరు లక్ష్మీ నరసింహ స్వామి భక్తులు. వారు ఆ గుడి చుట్టూ ఎత్తైన రాతి స్తంభాలను ఏర్పాటుచేసి, ఆ గుడిలో దీపాలను వెలిగించడం మొదలుపెట్టారు.గర్భగుడిలో నరసింహస్వామి, ఆయన భక్తుడు ప్రహ్లాదుడు కూడా ఉంటాడు. అందువల్లనే తెలుగు రాష్ట్రాలలో ఉన్న 9 నరసింహస్వామి ఆలయాలలో కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం విశిష్టమైనదిగా పేరొందింది. గర్భగుడిలోనే లక్ష్మీదేవి గుడి కూడా ఉంది.గుడి బయట వున్న జయ విజయుల విగ్రహాల శిల్ప రమణీయత చెప్పనలవి కాదు.ఈ ఆలయం దాదాపు 10 ఎకరాలలో విస్తరించి ఉంది.
క్రీ.శ.1509లో విజయనగరం సామ్రాజ్యాన్ని అధిష్టించిన తరువాత శ్రీ కృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని దర్శించి, గర్భ గుడి ముందర రంగ మండపాన్ని నిర్మింపజేశారు. ఆ తర్వాత వచ్చిన అచ్యుత దేవరాయలు 1545 లో తూర్పు గోపురాన్ని నిర్మించారని , 1469 లో దక్షిణ గోపురాన్ని సాసవల చిన్నమ్మ, పడమర గోపురాన్ని 1556లో కొక్కంటి పాలెగాళ్లు,ఉత్తర గోపురాన్ని టిప్పు సుల్తాన్ కాలం(1782_99)లో ముస్లిం పాలకులు నిర్మించినట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తోంది. 1569 లో తిరుమల రాయలు 10 మండపాలను, పుష్కరిణి (కోనేరు)ని నిర్మించారని దానికి సంబంధించిన శాసనాలు కూడా ఉన్నాయని కొన్ని కథనాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం సంక్రాంతి మరుసటి దినం కనుమ రోజున లక్ష్మీనరసింహుడు సతీ సమేతంగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న లఘుమ్మ కొండ(కదిరి కొండ_గాండ్లపెంట కు వెళ్ళే దారిలో ఉంది) దగ్గరకు పులి పారువేటకు వస్తాడని ఇక్కడి భక్తుల విశ్వాసం. పులిపారువేట అంటే పులివేట. మారిన పరిస్థితుల్లో పారువేటను కుందేల్లను వేటాడడంగా మార్చినారు. ఈ పారువేట అనంతరం స్వామి వారిని ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకొస్తారు.ఈ గుడికి ఎదురుగా లక్ష్మీనరసింహస్వామి రథం ఉంది దీనిని చెక్కతో నిర్మించారు. దీని బరువు 120 టన్నులు. దీనికి ఆరు చక్రాలున్నాయి. 45 అడుగుల ఎత్తు కలిగి ఉంది.స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంలో తిరుణాల రోజున రథోత్సవం జరుగుతుంది ఆ రోజు లక్షలాది మంది భక్తులు స్వామి దర్శనం కోసం వస్తుంటారువీరిలో చాలామంది రధాన్ని పురవీధుల గుండా గుడి చుట్టూ లాగుతారు ప్రధానికి పెద్ద మోపులు కట్టి దాన్ని ప్రజలు లాగుతూ గుడిచుట్టూ ప్రదక్షిణ చేస్తారు.
1569 లో తిరుమల రాయలు 10 మండపాలను, పుష్కరిణి (కోనేరు)ని నిర్మించారని దానికి సంబంధించిన శాసనాలు కూడా ఉన్నాయని కొన్ని కథనాలు ఉన్నాయి.లక్ష్మీనరసింహస్వామి ఆలయం లోపల ఒక కోనేరు ఉంది. బయట ఒక కోనేరు ఉంది. లోపల ఉన్న కోనేరు చాలా చిన్నది .బయట ఉన్నది చాలా పెద్దది .అయితే బయట ఉన్న పుష్కరిణిలో నీరు పరిశుభ్రంగా లేనందున ఎవరూ అక్కడ స్నానం చేయట్లేదు. స్నానపు గదుల్లో స్నానం చేస్తున్నారు.పాలకవర్గం తగిన చర్యలు తీసుకుంటే పుష్కరిణి చాలా బాగుంటుంది. ప్రతి గుడికి ఒక కోనేరు ఉంటుంది కారణమేంటంటే గుడికి చుట్టూ నాలుగు గోపురాలు కట్టేటప్పుడు కింద నుంచి రాళ్లు తీసుకెళ్లడానికి గోపురం చుట్టూ మట్టిని ఏటవాలుగా పోస్తారు .ఆ మట్టిపై రాళ్లను ఏటవాలుగా దొర్లించుకుంటూ పైకి తీసుకెళ్తారు .అలా గోపురాన్ని నిర్మిస్తారు. కోనేరు కోసం తవ్వినప్పుడు వచ్చిన మట్టినే వాడుకుంటారు. అలా కోనేరును తప్పనిసరిగా ఏర్పాటు చేస్తారు. ఇది పూర్వ కాలంలో అన్ని చోట్లా జరిగింది.
