
రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో లో పుంగనూరు అనే ఊరు ఉంది. పుంగనూరు అసలు పేరు పుంగ పురి. ఈ ఊరు పూర్వం పరుశురామ క్షేత్రం గా పేరుగాంచింది. చోళుల కాలంలో దీనిని పులనాడు అనేవారు. పుంగన్ లేదా పుంగవన్ అంటే తమిళంలోమునిశ్రేష్టుడని అర్థం. ముని పుంగవుడైన వాల్మీకి ఈప్రాంతంలో నివాసం ఏర్పరుచుకున్నారని ప్రతీతి. అందుకే ఆయన పేరుతో పుంగన్ +ఊరు = పుంగనూరు అయిందని చెపుతారు. పుంగనూరు ప్రాంతంలో పుంగ(కానుగ) వృక్షాలు ఎక్కువగా వుండడం వల్ల ‘పుంగనూరు’ అనే పేరు వచ్చివుండవచ్చని మరి కొందరి వాదం. పుంగం అంటే ఎద్దు. ముందునుంచి పుంగనూరు ఒక ప్రత్యేకమైన జాతి ఆవులకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఈ ఊరికి పుంగనూరు అనే పేరు వచ్చిందంటారు. ఇంకా కొంతమంది. ‘వలవనారాయణ చతుర్వేదిమంగళం’ అనే పేరుగల ఊరిని పుంగమ్మ అనే రాణి ఏలినందు వల్ల ఆమె పేరుతో పుంగమ్మ ఊరు పుంగనూరుగా మారిందని చెపుతారు.

పుంగమ్మ పేరు మీద ఈ ప్రాంతంలో అత్యంతప్రచారంలో వున్న కోలాట పదం చూడవచ్చు. ఏమే భామా! భామా నీ పేరేమి? నీ ఊరు పేరేమి? నిలిచి మాట్లాడు! అని అడిగితే ఊరు గొప్పదిరా! ఉగ్రచందికరా పుంగమ్మ ఏలేటి పుంగనూరు మాదిరా! అనిసమాధానం చెప్పింది. దీన్ని బట్టి చూస్తే వలవనారాయణచతుర్వేది మంగళాన్ని ధైర్య సాహసాలకు మారుపేరైనపుంగమ్మ అనే రాణి ఏలిందని, ఆమె పేరుతోనే ‘పుంగనూరు’ ఏర్పడిందని తెలుస్తోంది. పుంగనూరులో చారిత్రాత్మకమైన ఒక చెరువు వుంది. ఈ చెరువు పేరు పూర్వం ‘రాజేంద్ర సోళపేరేరి’ వర్షాలు ఎక్కువై చెరువుకు గండి పడింది. చెరువు తెగితే ఊరు ఊరే కొట్టుకుపోతుంది. ప్రజలు ఎంత కష్టం పడ్డా గండిని పూడ్చ లేకపోయారు. చివరకు పుంగమ్మ తను పరిపాలిస్తున్న ప్రజల కోసం గండికి అడ్డుపడి, తనపై కట్ట కట్టమంది. ప్రజలు విధిలేక ఆమెపై మట్టితో గండిని పూడ్చారు. తమకోసం పుంగమ్మ తన ప్రాణాలను త్యాగం చేసినందువల్ల అక్కడే నది కట్టమీద ఆమె శిలా విగ్రహాన్ని పెట్టి, చిన్న గుడిని కట్టించి పూజిస్తున్నారు. పుంగమ్మ సత్యం వున్నంతకాలంఈ కట్ట తెగదని ఆ ఊరి ప్రజల నమ్మకం. ఆనాటి నుంచిరాజేంద్ర సోళ పేరేరి పుంగమ్మ చెరువు గా పేరు మారింది.
