————–*————- సేకరణ:– చందమూరి నరసింహా రెడ్డి 944683219 ————-—————

ఆయన ఓ విలక్షణ నటుడు…
ఎంమిరా ఆయప్ప అంత గొప్ప నటుడా అనుకోవచ్చు…
అవును డైలాగ్స్ చెప్పేతీరు వైవిధ్యమైనది..‘ఏమ్… రా… ఏం చాస్తాండావ్, యాడికిపోతాండావ్ ఇలా రాయలసీమ మాండలికంలో ఆయన చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఆయనే జయప్రకాష్ రెడ్డి. విలన్ గా , హస్యనటుడుగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేదు.
జయప్రకాష్ రెడ్డి కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ మండలంలోని శిరువెళ్ళ గ్రామంలో 1946 మే 8న జన్మించాడు. తండ్రి సాంబిరెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసేవారు. తల్లి సామ్రాజ్యమ్మ.
నెల్లూరులోని పత్తేకాన్పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు చదివాడు. తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేట లోని ఉన్నత పాఠశాలలో చేరాడు. ఇతడు పదోతరగతిలో ఉండగా నాన్నకు అనంతపురం బదిలీ అయ్యింది.
అనంతపురం సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్ఎస్ఎల్సీ చదివారు. ఆయన ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ చదువుకున్నారు.
తర్వాత అక్కడే ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని గుంటూరు పురపాలక పాఠశాలలో గణితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాడు.
చిన్నప్పటి నుంచీ నాటకాలు పిచ్చి ఉన్నా గుంటూరు ఏసీ కళాశాలలో డిగ్రీ లో ఉన్నప్పుడు ‘స్టేజీ రాచరికం’లో సేవకి పాత్ర తో నాటక రంగస్థలం లో మొదటి అడుగు పడింది.నాటకం అయ్యాక అబ్బాయిలు ఎత్తుకుని ముద్దులు పెట్టేసుకున్నారు. యూనివర్సిటీ ప్రకటించిన బహుమతుల్లో ‘ఉత్తమ నటి జయప్రకాష్రెడ్డి’ అందుకొన్నారు. అప్పటి నుంచి నాటకాలు వేయడం, వేయించడమే పని గా మారింది.
1988 లో బ్రహ్మపుత్రుడు సినిమా తో సినీ రంగంలోకి అడుగు పెట్టారు.బ్రహ్మ పుత్రుడు 1988 లో వచ్చిన తెలుగు సినిమా. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రామానాయుడు నిర్మించాడు. ఈ సినిమాలో వెంకటేష్, రజనీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది తమిళ చిత్రం మైఖేల్ రాజ్కు రీమేక్.
జయప్రకాష్ రెడ్డి సినీ రంగ ప్రవేశం కు దాసరి నారాయణరావు ఆద్యుడు.
ఒకసారి జయప్రకాష్ రెడ్డి నల్గొండలో గప్ చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావుకు అతని నటన నచ్చి నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశాడు. అలా ఈయన తెలుగు సినీరంగానికి పరిచయమయ్యాడు.
తెలుగు భాషాబిమాని . విపరీతంగా పుస్తకాలు చదివే అలవాటు. పాలగుమ్మి పద్మరాజు రచనలు హృదయానికి హత్తుకుంటాయని ఆయన రచనల్లో కాల్పనికత తక్కువ. బయటి సంఘటనల్లోంచే కథలు పుట్టిస్తారని తెలిపారు. దర్శకుడు వంశీ రచనలు, శైలి ఇష్టం. ‘మా పసలపూడి కథలు’ పుస్తకం బాగా ఇష్టపడేవారు.డాక్టర్ నక్కా విజయరామరాజు ‘భట్టిప్రోలు కథలు’ బాగుంటాయనేవారు.
చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆసక్తి ఉండేది. తండ్రి కూడా రంగస్థలనటుడే తండ్రీ కొడుకులు కలిసి కూడా నాటకాల్లో నటించారు.
ఆయన పలు స్టేజీలపై మోనో యాక్టింగ్ చేసిన అలెగ్జాండర్ నాటకాన్ని సినిమాగా కూడా రూపొందించారు.నాటక రంగాన్ని బాగా ఇష్టపడే జయప్రకాష్ రెడ్డి కి అలెగ్జాండర్ పాత్ర అంటే చాలా ఇష్టం. దాదాపు1000 సార్లు పైగా అలెగ్జాండర్ పాత్ర ను రంగస్థలం పై వేశారు.
చిత్రం భళారే విచిత్రం 1992 లో విడుదల అయిన హాస్య చిత్రం రెండవది. అయితే 1997 లో విడదలైన ప్రేమించుకుందాం రా చిత్రం వరకు పెద్దగా గుర్తింపు రాలేదు్ ఈ చిత్రంతో గుర్తింపు పొందారు.
బాలకృష్ణ హీరోగా నటించిన సమరసింహా రెడ్డి సినిమాలో పోషించిన వీరరాఘవరెడ్డి పాత్ర అతనికి ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. విలన్ పాత్రను పండించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
సీతయ్య, ఛత్రపతి, గబ్బర్సింగ్, నాయక్, రేసుగుర్రం, మనం, టెంపర్, సరైనోడు, జయంమనదేరా,శత్రువు, లారీ డ్రైవర్, బొబ్బిలిరాజా, చిత్రం భళారే విచిత్రం, జంబలకిడి పంబ, చెన్నకేశవ రెడ్డి సినిమాల్లో విలన్ పాత్రలు పోషించారు. హాస్య పాత్రలను కూడా పోషించారు.
ప్రేమించుకుందాం రా సినిమా నటుడిగా ఆయనకు చాలా పెద్ద బ్రేక్ ఇచ్చింది. సమర సింహారెడ్డి విలన్గా ఆయన్ని తిరుగులేని స్థాయిలో నిలబెట్టింది. ఆ తర్వాత జయం మనదేరా, నరసింహనాయుడు ఇలా వరుస చిత్రాలతో తెలుగు,తమిళ, కన్నడ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు.
డీ ,రెడీ, ఎవడిగోల వాడిది, కిక్ సినిమాలో ఆయన పండించిన హాస్యం ఇప్పటికి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతుంది. మంచి టైమింగ్తో అలరించాడు.
సరిలేరు నీకెవ్వరు ఆఖరి సినిమా.ఆయనను నంది అవార్డు కూడా వరించింది.
జయప్రకాష్ రెడ్డికి ఇద్దరు సోదరులు రవీంద్రనాథ్ రెడ్డి , శ్రీనివాస్, ఇద్దరు సోదరీమణులు స్వర్ణలత, నాగరేఖ. జయప్రకాష్ రెడ్డి భార్య రాజ్యలక్ష్మి. కుమారుడు చంద్రప్రకాష్ రెడ్డి. కుమార్తె శ్రీమల్లిక. 2020 సెప్టెంబర్8 న గుంటూరు లో గుండెపోటు గురై మరణించారు.
